AR Rahman Telugu
AR Rahman Telugu
ఎ. ఆర్. రెహమాన్ పేరుతో పేరుగాంచిన అల్లా రఖా రెహమాన్ (About this sound pronunciation (సహాయం·సమాచారం) (జ.6 జనవరి 1967) ఒక ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు,, దాత. రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది.

రెహ్మాన్‌ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. తండ్రి ఆర్. కె. శేఖర్, తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్ కు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. అక్క కొడుకు జి. వి. ప్రకాష్ కూడా ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు. నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. దూరదర్శన్ వండర్ బెలూన్ అనే ఒక కార్యక్రమంలో ఒకేసారు నాలుగు కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు.

పనిలో పడి బడికి సరిగా వెళ్ళలేక పోయాడు. సంగీత దర్శకులు కూడా సొంత పరికరాలు కొనుక్కోవడంతో వీరి అద్దె వ్యాపారానికి గిరాకీ తగ్గింది. దాంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసి సంగీతం మీదనే దృష్టిపెట్టమని చెప్పింది. మొదట్లో చదువుకోలేకపోయినందుకు అసంతృప్తి చెందినా తరువాత జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషపడ్డాడు. 1987 లో చెన్నై లోని కోడంబాకం లోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో కూడా రెహమాన్ కు ఓ ఇల్లుంది. పని ఒత్తిడి నుంచి బయటపడ్డానికి, సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు.

తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు.[2] రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంట్లో హిందూ దేవుళ్ళతోపాటు మేరీమాత, మక్కా మదీనా చిత్రాలు కూడా ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రశాంతత కోసం నెల్లూరు జిల్లా, తడ దగ్గరలోని సూఫీ ప్రవక్ర కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం 1989వ సంవత్సరంలో ఇస్లామ్‌లోకి మారింది. ఇది జరగక మునుపే చెల్లెలు పెళ్ళి కోసం ఓ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళారు. అప్పటికే దిలీప్ అనే పేరు అంతగా నచ్చని రెహమాన్ తనకు పేరు మార్చుకోవాలని ఉందని ఆయన్ను అడిగాడు. ఆయన అబ్దుల్ రహీమ్ కానీ అబ్దుల్ రెహమాన్ కానీ పేరు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుందని సలహా ఇచ్చాడు. రెహమాన్ అనే పేరు నచ్చడంతో అప్పటి నుంచి అలాగే పేరు మార్చుకున్నాడు. తల్లి ఆ పేరు ముందు అల్లా రఖా అనే పేరును చేర్చింది. ఆమె కూడా తన పేరును కరీమాగా మార్చుకుంది. ఈయన కడప లోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను తరచూ సందర్శిస్తారు.